స్కూల్ బస్సుల నిర్వహణలో నిబంధనలు పాటించాల్సిందే…
షాద్ నగర్ ఆర్టీవో వాసు
విద్యార్థులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలి.
విద్యార్థులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేలా చూడాలని, స్కూల్ బస్సుల నిర్వహణ బాధ్యత పూర్తిగా ఆయా పాఠశాలల యజమాన్యాలదే అని విద్యార్థుల భద్రతకు సంబంధించి ఏ చిన్నపాటి రాజీ కూడా ఉండదని షాద్ నగర్ ఆర్టీవో వాసు అన్నారు. షాద్ నగర్ ఆర్టివో కార్యాలయంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ… విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ బస్సుల నిర్వహణ వాటి భద్రతా ప్రమాణాలపై ఆర్టిఏ కఠినమైన మార్గదర్శకనులను అమలు చేస్తుందని, విద్యార్థులకు సురక్షితమైన ప్రయాణం అందించకపోతే ఆయా విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో విద్యార్థుల ప్రయాణం పట్ల అజాగ్రత్తగా ఉన్న పాఠశాలలకు హెచ్చరికలు జారీ చేశామని, ఇలాంటివి పునరావృత్తం అయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా బస్సుల సామర్థ్యానికి మించి అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించి వాహనాలను నడిపిన, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సహించేది లేదన్నారు. సరైన ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా బస్సులు నడిపితే వాటిని సీజ్ చేయడంతో పాటు పాఠశాల యజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై తరచుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
