రోడ్లు విస్తరణ చేస్తేనే సౌకర్యం
** వార్డుల పర్యటనలో ఎమ్మెల్యే శ్రీనివాసులు
తిరుపతి: తిరుపతి నగరంలో విపరీతంగా పెరిగిన జనాభా, వాహనాల రద్దీ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ జరిగితేనే సౌకర్యం కలుగుతుందని ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. నగరంలోని 43, 44 డివిజన్ల పరిధిలోని రోడ్లను ఎమ్మెల్యే ఉదయం పరిశీలించారు. ముఖ్యంగా 44వ డివిజన్ పరిధిలోని నర్సరీ వీధిని ఇంజినీరింగ్ అధికారులు, టౌన్ ఫ్లానింగ్ అధికారులతో కలిసి వీధి మొత్తం పరిశీలించారు. రోడ్డు ఆక్రమణలతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి వీధిలో లేకపోవడంతో ఇటీవల ఇద్దరు చనిపోయినట్లు స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే డ్రైనీజీ సమస్యతో దుర్వాసనకు తోడు దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకి చెప్పారు. వర్షం పడితే డ్రైనేజీ నీరు నిల్వ ఉండిపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆ ప్రాంతవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు రోడ్డును పూర్తిస్థాయిలో విస్తరిస్తే తమ ఇళ్ళు దెబ్బతింటాయని వార్డులోని వీధి వాసులు ఎమ్మెల్యే కి తెలిపారు.
నర్సరీ వీధిలో రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం కోసం 76 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు విస్తరణ ఎలా చేయాలి అనేది ఇంజినీరింగ్, టౌన్ ఫ్లానింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్డు, డ్రైనేజి సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. 43వ డివిజన్ లో డ్రైనీజి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (టీ.ఎన్.టీ.యూ.సీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ టీడీపీ జోన్ – 4 ఇన్చార్జ్
డా.అంబూరు సింధూజ,
కార్పోరేటర్లు వరికుంట్ల నారాయణ, నరసింహాచ్చారి, నరేంద్ర, సికే రేవతి, శైలజ, దూది కుమారి, రాధ, రాజా రెడ్డి, మహేష్ యాదవ్, దూది శివ, కార్పొరేషన్ ఎస్ఈ శ్యామ్ సుందర్, డీసీపీ మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
