అగ్ని ప్రమాదాలకు అప్రమత్తతే విరుగుడు
** తిరుపతి మేయర్ శిరీష సూచన
తిరుపతి: అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండటమే ప్రధాన మార్గమని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ అన్నారు. గోవిందరాజుల ఆలయం సన్నిది వీధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో మేయర్ శిరీష నగర పాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి విపత్తు నివారణ, అగ్ని మాపక శాఖ అధికారులు, షాపు నిర్వాహకులతో మున్సిపల్ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తిరుపతి నగరం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నగరం అని.. నిత్యం శ్రీవారి భక్తులు సందర్శించే ఆలయాలు నగరంలో ఉన్నందున తిరుపతి నగర ప్రజలకు, శ్రీవారి భక్తులతో పాటు షాపులో పనిచేసే కార్మికుల భద్రత రీత్యా అందరూ నిబంధనలు పాటిస్తూ అగ్ని ప్రమాదాలను నివారించాలని తెలిపారు. నగర ప్రాధాన్యత గొప్పగా ఉన్నా ప్రణాళిక లోపం కారణంగా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, సినిమా థియేటర్లు కేంద్రీకరించి ఉన్న కారణంగా ప్రజలు ఒకే చోట గుమికూడి ఉంటారని తెలిపారు. అలాంటప్పుడు విపత్తులు, అగ్ని ప్రమాదాలు జరిగితే నష్టం కూడా తీవ్రంగానే ఉంటుందన్నారు. అందుకే అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడటం, అందుకు అందరూ నిబంధనలను పాటించడం ఒక్కటే పరిష్కారం అన్నారు.
ఈ మధ్య గోవిందరాజుల ఆలయం సన్నిది వీధిలో జరిగిన ప్రమాదాన్ని తాను పరిశీలించానని, ఆందోళన కలిగించే పరిస్థితులు కనిపిస్తుందని పేర్కొన్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినా వాటి నుంచి మనం ఏమి నేర్చుకున్నాము ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. తన పరిశీలనలో ప్రధానంగా అర్థం అవుతున్నది విపత్తు నివారణ, అగ్ని మాపక శాఖ నిబంధనలు పాటించక పోవడం, షాపులు ఒకే చోట కేంద్రీకరించి ఉండటంతో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నివారణకు తగిన ప్రాధమిక ఏర్పాట్లు చేసుకోకుండా ఉండటం కనిపిస్తుందన్నారు. జిల్లా విపత్తు నివారణ, అగ్ని మాపక శాఖతో నగర పాలక సంస్థలోని విపత్తు నివారణ అగ్నిమాపక శాఖ సమన్వయం చేసుకుని షాపు నిర్వాహకులకు చైతన్యం కల్పించాలని కోరారు. నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. కనీసం గ్రూప్ షాపులు అందరూ కలిసి కనీస ప్రమాద నివారణ ఏర్పాట్లు చేసుకునేలా చూడాలన్నారు. నగరపాలక సంస్థ నుంచి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నగర పాలక సంస్థ నుంచి చైతన్యం కల్పించి తగిన సహకారం అందిస్తామని తదనంతరం నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ అమరయ్య, ఎస్.ఈ శ్యామసుందర్, డి.సి.పి ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఆరోగ్యాధికారి యువ అన్వేష్, జిల్లా, నగరపాలక సంస్థ విపత్తు నివారణ అగ్ని మాపక శాఖ అధికారులు శ్రీనివాస రావు, నగరంలోని షాపు నిర్వాహకులు పాల్గొన్నారు.
