శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలు దేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరహస్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ ఛైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బీ.ఆర్) నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మీ సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి కూడా ఉన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్, ఈవో శ్రీవారి చిత్ర పటాన్ని తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకి దేవి, భాను ప్రకాష్ రెడ్డి, సీవీఎస్వో మురళీకృష్ణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఏఎస్పీ రవిమనోహరచారి, ఇతర జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.
