వైభవంగా లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర
** గజ, గరుడ వాహనాల్లో అమ్మవారికి అలంకరణ
…..
తిరుపతి: తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అదనపు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరులోని శిల్పారామం – పసుపుమండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడ వీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో సింఘాల్ మాట్లాడుతూ, శ్రీవారి ఆభరణాలలో లక్ష్మీ కాసులహారం అత్యంత ప్రధానమైందని, పౌర్ణమి గరుడసేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మలయప్ప స్వామి వారికి అలంక రిస్తామని తెలిపారు. సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడవాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రాత్రి జరిగిన గజ వాహనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వి.వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
