పెన్షనర్ల సమస్యలపై అండగా ఉంటా – ఎమ్మెల్యే నాయిని..
కాజీపేట, హనుమకొండ: కాజీపేట రైల్వే సంఘ్ కార్యాలయంలో పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాజీపేట సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే నాయిని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం సంఘం తరఫున విడుదల చేసిన పాకెట్ డైరీలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ, పెన్షనర్లు సమాజానికి అందించిన సేవలు ఎనలేనివని, వారి సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగుల యోగక్షేమాల కోసం మాట్లాడుకునేందుకు భవన ఏర్పాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తప్పకుండా స్థల కేటాయింపు చేయిస్తానని తెలిపారు.
పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పెన్షనర్లకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
