బడ్జెట్ పై “కూటమి” జిల్లా అధ్యక్షుల ప్రశంసలు
తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని కూటమి పార్టీలకు చెందిన తిరుపతి జిల్లా అధ్యక్షులు ప్రశంసలు కురిపించారు. ఈమేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ, జనసేన అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరి, బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ లు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, యాదవ కార్పోరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, నాయిబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివంలు కూడా పాల్గొన్నారు. మూడు లక్షలా ముప్పయ్ రెండు వేల రెండు వందల ఐదు కోట్ల బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీఠ వేశారని నేతలు చెప్పారు. బడ్జెట్ లో మూలధన వ్యయంకు పదహారు శాతం కేటాయించి అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధికి, విద్యాశాఖకు, సాగునీటి ప్రాజెక్ట్స్ కు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు రాజధాని అమరావతి నిర్మాణం ఆరువేల కోట్లు, పోలవరం ప్రాజెక్ట్ కు ఆరువేల నూట ఐదు కోట్లు కేటాయించారని వివరించారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ సహకారమే కారణమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నేతలు కృతజ్జతలు తెలిపారు. బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి, భవిష్యత్ కు బ్లూఫ్రింట్ వంటిదని టిడిపి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ అన్నారు. ఎస్సీ,ఎస్టీ,బిసి, మైనార్టీల, మహిళా సంక్షేమానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆమె తెలిపారు. యువనాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని చెప్పారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముప్పయ్ వేల కోట్ల కేటాయించారని ఆమె చెబుతూ ముఖ్యమంత్రికి కృతజ్జతలు తెలిపారు.
సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం మూడు సూత్రల మేరకు బడ్జెట్ ను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని బిజేపి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర సమగ్ర వికాశం కోసం మూడు ప్రాంతాలకు సమదృష్టితో కేటాయింపుల్లో ప్రాధాన్యత బడ్జెట్ లో ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుతూ ఏపి పునర్ నిర్మాణానికి బడ్జెట్ బాటలు వేస్తుందని ఆయన తెలిపారు. వికసిత్ ఏపి సాధించడం ద్వారా వికసిత్ భారత్ సాధించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగ పడుతుందని చెప్పారు. రాష్ట్ర యాదవ కార్పోరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మన్, రాష్ట్ర నాయిబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం లు మాట్లాడుతూ 2026-2027 బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే బడ్జెట్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
