శ్రీ మరకత లింగేశ్వర దివ్య క్షేత్రంలో రాజ్యసభ ఎంపీ, టాలీవుడ్ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు
రోజురోజుకు పెరుగుతున్న వివిఐపీల తాకిడి
శంకర్పల్లి: శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో వెలిసిన 11వ శతాబ్దానికి చెందిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర దివ్య క్షేత్రంలో మంగళవారం రాజ్యసభ ఎంపీ, టాలీవుడ్ సినీ రచయిత, డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి ఎంపీని స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పురాతన శివలింగాన్ని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతంగా ఉందని, బ్రహ్మసూత్ర మరకత లింగం కలిగిన ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయని చెప్పారు. దేశంలో రెండే బ్రహ్మసూత్రం కలిగిన మరకత లింగాలు ఉన్నాయని, ఒకటి తమిళనాడు రాష్ట్రంలో, మరొకటి తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని చందిప్పలోనే ఉందని చెప్పారు. రోజురోజుకు మరకత శివాలయానికి వివిఐపీల తాకిడి బాగా పెరుగుతుందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సాయిశివ, ప్రమోద్ ఉన్నారు.
