ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే నిజమైన జర్నలిజం

TEJA NEWS

ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే నిజమైన జర్నలిజం

నిజం కోసం కలం పట్టిన నజీర్ ఖాన్‌కు ప్రతిష్టాత్మక గౌరవం

సాధారణ కుటుంబంలో జన్మించి తన కలం శక్తితో సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జర్నలిస్ట్ నజీర్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. పత్రికారంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్పూర్తి అకాడమీ ఫౌండర్ & చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా అందజేశారు.
సూర్యాపేట ప్రాంతంలో జర్నలిజం రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నజీర్ ఖాన్, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, బాధితులకు న్యాయం జరిగేలా వార్తల ద్వారా అవగాహన కల్పించడం ఆయన జర్నలిజం లక్షణంగా నిలిచింది.


గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు, రహదారి సమస్యలు, మౌలిక వసతుల కొరత, సామాజిక సమస్యలు వంటి అనేక అంశాలపై ఆయన రాసిన కథనాలు ప్రజల్లో చైతన్యం కలిగించాయి. సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారానికి దోహదపడిన సందర్భాలు అనేకం. నిష్పక్షపాత ధోరణి, నిజాయితీతో ఆయన జర్నలిజం కొనసాగిస్తూ ప్రజల నమ్మకాన్ని సంపాదించారు.
జర్నలిస్ట్‌గా మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. యువతలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ సమాజానికి సేవ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పత్రికారంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్‌తో సత్కరించడం విశేషంగా భావిస్తున్నారు. ఈ అవార్డు కార్యక్రమం మార్చి 10, 2026న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సిటీ కల్చరల్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి సెక్రటరీ డాక్టర్ కాశీనాథ్, నేషనల్ హ్యూమన్ రైట్స్ వింగ్ చైర్మన్ డాక్టర్ సరిత మాలో, స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవో చీఫ్ అడ్వైజర్, జిహెచ్ఎంసి బీజేపీ నాయకుడు గూడూరి శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఎంఈఓ డాక్టర్ కస్నా నాయక్, “వందే భారత్ సేవ్ ఇండియా” మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మరియు సినీ నటుడు మల్లం రమేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్ఫూర్తి సర్వీసెస్ ఫౌండర్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్, స్ఫూర్తి సర్వీసెస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల మంజుల చేతుల మీదుగా జర్నలిస్ట్ నజీర్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నజీర్ ఖాన్ మాట్లాడుతూ, “ఈ గౌరవం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇది నా వ్యక్తిగత విజయమే కాదు, నన్ను నమ్మి ప్రోత్సహించిన ప్రతి పాఠకుడి విజయం. ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది. ఇకపై కూడా ప్రజల పక్షాన నిలబడి నిజం కోసం నిర్భయంగా కలం పట్టుతాను” అని అన్నారు.
పత్రికారంగంలో ఆయన చేసిన సేవలు యువ జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని, అలాంటి జర్నలిస్టులకు ఈ తరహా గౌరవాలు దక్కడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top