మూసి వాగులో బ్యాటరీలతో చేపల వేట
అంతరించిపోతున్న చేపపిల్లలు
ఆందోళనలో స్థానిక మత్స్యకారులు
చేపల సంరక్షణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ పరిధిలో ప్రవహిస్తున్న మూసి వాగులో కొందరు వ్యక్తులు అక్రమంగా బ్యాటరీల సహాయంతో విద్యుత్ షాక్ ఇచ్చి చేపలను పట్టుతున్న ఘటన స్థానిక మత్స్యకారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టేకుమట్ల, రాయినిగూడెం గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు మూసి వాగులోని పాలు చెక్ డ్యామ్ ల వద్ద నిల్వ ఉన్న నీటిలో బ్యాటరీలను ఉపయోగించి కరెంట్ ప్రవహింపజేసి చేపలను పడుతున్నారు. ఈ విధంగా విద్యుత్ షాక్ ద్వారా చేపలను పట్టడం వల్ల పెద్ద చేపలతో పాటు చిన్న చేపలు, చేపల గుడ్లు, ఇతర నీటిజీవులు కూడా నశించే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో చేపల పెరుగుదల పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని స్థానిక జాలరులు తెలియజేస్తున్నారు. చెరువులు, వాగులు, నదులలో సహజంగా పెరిగే చేపల సంఖ్య తగ్గిపోతే, వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిజమైన మత్స్యకారులకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో వలలు వేసి చేపలు పట్టే వారు రోజుల తరబడి కష్టపడాల్సి వస్తుంది.
అయితే కొందరు వ్యక్తులు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులను సంపాదించడానికి బ్యాటరీలతో విద్యుత్ షాక్ ఇవ్వడం ద్వారా కొద్ది నిమిషాల్లోనే పెద్ద మొత్తంలో చేపలను పట్టేస్తున్నారు. ఈ విధానం వల్ల నీటిలో ఉన్న చిన్న చేపలు కూడా చనిపోవడంతో భవిష్యత్తులో చేపల వనరులు పూర్తిగా తగ్గిపోతాయని వారు అంటున్నారు. అదేవిధంగా విద్యుత్ ద్వారా చేపల వేట చేయడం చట్టపరంగా కూడా నేరంగా పరిగణించబడుతుందని మత్స్యకారులు గుర్తుచేస్తున్నారు. భారత మత్స్య సంపద సంరక్షణ చట్టాల ప్రకారం నీటిలో విద్యుత్ ప్రవహింపజేసి చేపలు పట్టడం నిషేధించబడింది. అలా చేసే వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు లేదా జైలుశిక్ష విధించే అవకాశముందని అధికారులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ కొందరు వ్యక్తులు ఈ అక్రమ పద్ధతిని కొనసాగిస్తున్నారని వారు తెలిపారు.
ఈ నేపథ్యంలో టేకుమట్ల, ఎండ్లపల్లి, రాయినిగూడెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు జిల్లా అధికారులు, పోలీసులు , మత్స్యశాఖ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. మూసి వాగు ప్రాంతంలో అక్రమంగా బ్యాటరీలతో చేపలు పట్టుతున్న వారిని గుర్తించి వారి వద్ద ఉన్న బ్యాటరీలను స్వాధీనం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే అటువంటి వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించి భవిష్యత్తులో ఈ విధమైన అక్రమ పద్ధతులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మత్స్య సంపదను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అక్రమంగా చేపలు పట్టడం వల్ల సహజ వనరులు నాశనం కావడమే కాకుండా నిజమైన మత్స్యకారుల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడుతుందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మూసి వాగులో చేపల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్థానిక మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
