
ఎం.వి.ఐ కార్యాలయం ముందు లారీ యజమానుల అర్ధనగ్న ప్రదర్శన.. క్యూఆర్ కోడ్ రేడియం స్టిక్కర్ల విధానాన్ని రద్దు చేయాలి.
కోదాడ. క్యూఆర్ కోడ్ రేడియం స్టిక్కర్ల పేరిట జరుగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ లారీ అసోసియేషన్ నాయకులు కోదాడ ఎం.వి.ఐ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారిపై ఇక తమ ఒంటిపై బట్టలు తప్ప ఏమీ లేవని చొక్కాలు విప్పి అర్ధనగ్నంగా ప్రదర్శన చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు. బయట మార్కెట్లో తక్కువ ధరకు లభించే రేడియం స్టిక్కర్లను, ప్రభుత్వం జీవో తీసుకువచ్చి ఏజెన్సీల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తూ లారీ యజమానులను, ఇతర వాహనదారులను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికే అనేక పన్నులతో మోయలేని భారంతో రవాణా రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని కొత్తగా తీసుకు వచ్చిన రేడియం స్టిక్కర్ల విధానం మరింత భారంగా మారిందన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ దోపిడీని తక్షణమే అరికట్టాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు తూనం కృష్ణ, సెక్రటరీ యలమందల నరసయ్య, రాష్ట్ర చైర్మన్ రామినేని శ్రీనివాసరావు, పెద్ది చంద్రమౌళి, కనగాల నాగేశ్వరరావు, లింగయ్య,గౌస్, బాబా తదితరులు పాల్గొన్నారు.