
రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ కీలకం….పోలీస్, వైద్య సిబ్బంది సమన్వయంతో ప్రాణాల రక్షణ: డీసీపీ బి. రామ్ రెడ్డి…
…
పెద్దపల్లి//గోదావరిఖని: “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత కార్యక్రమం షెడ్యూల్లో భాగంగా, గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఎస్ ఐ రమేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ గోదావరిఖని వైద్య సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం కి పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు, ప్రమాదాల అనంతరం తక్షణ వైద్య సహాయం ప్రాముఖ్యతపై దృష్టి సారించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని రోడ్డు ప్రమాదాల సమయంలో “గోల్డెన్ అవర్” అత్యంత కీలకమని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే మొదటి గంటలో సరైన వైద్యం అందితే ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది వేగవంతమైన స్పందన, అత్యవసర చికిత్స అందించడం, బాధితులను సమయానికి రిఫర్ చేయడం వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించడంలో ట్రాఫిక్ నియమాల పాటింపు అత్యవసరమని పేర్కొన్నారు.
హెల్మెట్ ధరించడం, సీట్బెల్ట్ వినియోగం, మితిమీరిన వేగం నివారణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే విషయాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ విషయంలో వైద్య సిబ్బంది కూడా ప్రజలకు సూచనలు ఇవ్వడం ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సబ్ఇన్స్పెక్టర్ రమేష్ , పోలీస్ సిబ్బంది మరియు వైద్య సిబ్బంది పరస్పర సహకారంతో రోడ్డు ప్రమాదాల సమయంలో సమర్థవంతంగా స్పందించే విధానాలపై చర్చించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్, వైద్య విభాగాల మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో వివరించారు.
చివరగా, అధికారులు మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలు పాటించడం ద్వారా మాత్రమే ప్రమాదాలను నివారించవచ్చని, సమాజంలోని ప్రతి వర్గం కలిసి పనిచేస్తే “అరైవ్ అలైవ్” లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, ఆర్ఎమ్ఓ, ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, సబ్ఇన్స్పెక్టర్ రమేష్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, సుమారు 80 మంది వైద్య సిబ్బంది హాజరయ్యారు.