నేను ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు

TEJA NEWS

నేను ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ఫ్యాబ్రికేటెడ్ వీడియోలతో దుష్ప్రచారం అర్ధరహితం
జర్నలిజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించొద్ధు
ప్యారా నగర్ డంపు యార్డు విషయంలో ప్రజలకు సంపూర్ణ మద్దతు

పటాన్చెరు ఫ్యాబ్రికేటెడ్ వీడియోలతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్యారా నగర్ డంపు యార్డు విషయంలో స్థానిక జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో తాను కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఒక వీడియో వైరల్ కావడం పై ఆయన స్పందించారు. డంపు యార్డు విషయంలో జేఏసీ నాయకులతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గుమ్మడిదల ప్రజలకు సంపూర్ణ మద్దతు అందిస్తున్నారని వారికి సూచించడం జరిగిందని తెలిపారు.

ఈ క్రమంలో తాను కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఒక వీడియోను సృష్టించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేయడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన వివరణతో పాటు కనీసం అందులో పాల్గొన్న వారి వివరణ తీసుకోకుండా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు ప్రసారం చేయడం సరి కాదని తెలిపారు. ఏ అంశంపై నైనా కుండబద్దలు కొట్టినట్లు మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పడం అందరికీ తెలిసిన విషయమేనని.. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ వీడియోలను ప్రసారం చేస్తే ప్రజల్లో జర్నలిజంపై నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top