తిరుమ‌ల‌లో నీటి వృధాను అరిక‌ట్టేందుకు చర్యలు

TEJA NEWS

తిరుమ‌ల‌లో నీటి వృధాను అరిక‌ట్టేందుకు చర్యలు

** అలిపిరి వద్ద శాశ్వత టీటీడీ యాగశాల

** టీటీడీ బోర్డు మీటింగ్ లో చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి
తిరుమల: తిరుమ‌ల‌లో నీటి వృధాను అరిక‌ట్టేందుకు అన్ని చర్యలు తీసుకుని, రోజు రోజుకు పెరుగుతున్న నీటి అవ‌స‌రాల దృష్ట్యా గోగ‌ర్భం డ్యామ్ నుంచి ఫిల్ట‌ర్ ప్లాంట్ వ‌ర‌కు రూ.6 కోట్ల‌తో 2 కిలో మీట‌ర్ల‌ మేర అద‌న‌పు పైపులైన్ ఏర్పాటుకు టీటీడీ బోర్డులో ఆమోదం తెలిపినట్లు చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బీఆర్) నాయుడు తెలిపారు. బుధవారం బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్ లో ధర్మకర్తల మండలి (బోర్డు) మీటింగ్ జరిగింది.

టీటీడీ బోర్డులో ముఖ్య నిర్ణయాలు:

1)టీటీడీ అవ‌స‌రాల నిమిత్తం రూ. 44.20 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, త‌మిళ‌నాడుకు చెందిన కో-ఆప్టెక్స్ సంస్థ‌ల నుండి ప‌ట్టు వ‌స్త్రాలు, దుప్పటాలు తదితరాలు కొనుగోలు చేసేందుకు ఆమోదం.

2)అల్లూరు సీతారామ‌రాజు జిల్లా పాడేరు మండ‌లంలోని వ‌ర్ధ‌న‌ప‌ల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి రూ.55 ల‌క్ష‌లు ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం.

3)స‌నాత‌న ధ‌ర్మాన్ని మ‌రింత వ్యాప్తి చేసేందుకు తలపెట్టిన “అక్షర గోవిందం” కార్యక్రమంలో పాల్గొనే చిన్న పిల్లలకు పంపిణీ చేసే కిట్‌ను ఉచితంగా అందించేందుకు నిర్ణ‌యం.

4)త‌మిళ‌నాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా, పెరూర్ తాలూకాలోని శెట్టిపాళ్యం గ్రామంలో జీస్క్వేర్ రియ‌ల్ట‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్ర‌తినిధులు టీటీడీకి రిజిష్ట్ర‌ర్ చేసి ఇచ్చిన 19.43 ఎకరాల స్థ‌లాన్ని టీటీడీలో విలీనం చేసుకోవ‌డానికి ఆమోదం.

5)మ‌హారాష్ట్ర‌లోని న‌వీ ముంబైలో టీటీడీ నూత‌నంగా నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో త్వ‌ర‌లో మ‌హా సంప్రోక్ష‌ణ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో అవ‌స‌ర‌మైన సిబ్బందిని కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో నియామ‌కానికి ప్ర‌భుత్వ అనుమ‌తికై నివేదించాలని నిర్ణయం.
6)ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చును టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ సౌరబ్ బోరా భరించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.

7)తిరుమ‌ల‌లోని వ‌రాహ‌స్వామి విశ్రాంతి భ‌వ‌నం – 1లో రూ. 3.61 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ఆమోదం.

8)తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద రూ.4.75 కోట్ల‌తో శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ హోమం కోసం యాగ‌శాల నిర్మించేందుకు నిర్ణ‌యం.

9)ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హిత డా.శోభారాజును టీటీడీ ఆస్థాన విద్వాన్‌గా నియమించేందుకు నిర్ణ‌యం.

10)గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండ‌లంలో ఉన్న అనంతవరంలో ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో రూ.2.71 కోట్ల‌తో రాజ గోపురం నిర్మాణానికి ఆమోదం.

11)రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలోని వెంక‌ట‌పాలెంలో ఉన్న‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో రూ.36.95 కోట్ల‌తో ఏడు అంత‌స్తుల మ‌హా రాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్ధాల మండ‌పం, వాహ‌న మండ‌పం, ర‌థ మండ‌పం, శ్రీ ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యం, పుష్క‌రిణి నిర్మాణానికి ఆమోదం.

12)ప్ర‌స్తుతం తిరుమలలో కార్యాల‌యాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. పాల‌నా సౌల‌భ్యం కోసం అన్ని కార్యాల‌యాల‌ను ఒకే చోటు తీసుకొచ్చేందుకు నూతనంగా పరిపాలనా భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయం.

13)సత్యసాయి జిల్లా లేపాక్షిలో నూతన కల్యాణ మండపం నిర్మించేందుకు ఆమోదం.

14)దాతల ప్రివిలేజెస్ కు సంబంధించిన విధి విధానాల ఏర్పాటు చేయడానికి టిటిడి బోర్డు సభ్యులతో కమిటి ఏర్పాటు చేసేందుకు నిర్ణయం.

15)ఖ‌మ్మంలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి తెలంగాణ ప్ర‌భుత్వం కేటాయించిన 20 ఎక‌రాల స్థ‌లాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుని ఆల‌యం నిర్మించేందుకు ఆమోదం.

16)టీటీడీలో ప‌ని చేసే కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంద‌రికీ శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ల‌డ్డూ కార్డు జారీ చేయాల‌ని నిర్ణ‌యం.

17)టీటీడీ ఉద్యోగుల‌కు హెల్త్ స్కీమ్ లో భాగంగా ఇప్పుడిస్తున్న రూ.3 ల‌క్ష‌ల‌కు అద‌నంగా మ‌రో రూ.2 ల‌క్ష‌ల‌ను రీఎంబ‌ర్స్మెంట్ చేసేందుకు ఆమోదం.

18)అలిపిరి టోల్ గేట్‌ వ‌ద్ద వాహ‌నాల ర‌ద్దీని త‌గ్గించేందుకు అలిపిరిలోని శ్రీ వినాయ‌క‌స్వామి ఆల‌య స‌మీపంలో రూ.4.25 కోట్ల‌తో బ‌స్సుల త‌నిఖీల కోసం శాశ్వ‌త షెల్ట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం.

19)ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 5000/- నుండి రూ.10,000/- కు పెంచేందుకు నిర్ణయం.

20)శ్రవణం ప్రాజెక్టులో శిక్షణ పొందుతున్న వినికిడి లోపం గల 150 మంది పిల్లలకు ఉచితంగా వినికిడి యంత్రాలు ఇవ్వాలని నిర్ణయం. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్ఓ కే.వి. మురళీకృష్ణ, పీఆర్వోలు రవి, నీలిమ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top