
గంగమ్మకు తిరుమల శ్రీవారి నుంచి సారె సమర్పణ
తిరుపతి: స్థానిక శ్రీ తాతయ్య గుంట గంగమ్మకు తిరుమల శ్రీవారి తరఫున శ్రీవారి సారెను సాయంత్రం ఘనంగా సమర్పించారు. సంప్రదాయబద్ధంగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.
టీటీడీ తిరుమల పోటు ఏఈవో గుండ్లూరు మునిరత్నం, గోవిందరాజస్వామి ఆలయం నుంచి శ్రీవారి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఛైర్మన్ మహేష్ యాదవ్కు అందజేశారు. 5న చాటింపుతో ప్రారంభమైన శ్రీ గంగమ్మ జాతర 13వ తేదీ వరకు వైభవంగా కొనసాగనుంది.
తిరుపతి గ్రామదేవతగా పూజలందుకునే శ్రీ గంగమ్మ తల్లిని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సోదరిగా భావించే ఆనవాయితీ ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఏడాది శ్రీవారి ఆలయం నుంచి గంగమ్మ తల్లికి సారె సమర్పించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మీ, జానకీ దేవి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి గుండాల గోపినాథ్ రెడ్డి, గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఆర్.సి మునికృష్ణ, గోవిందరాజస్వామి ఆలయం ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, బొక్కసం ఇంఛార్జి గురురాజ స్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.