తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణను స్పీడప్ చేసింది

TEJA NEWS

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణను స్పీడప్ చేసింది. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 400 నుంచి 600 మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధుల ఫోన్‌లను ట్యాపింగ్‌ చేసినట్లు వెలుగులోకి రావడంతో బాధితుల నుంచి అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇవాళ (మంగళవారం) ఉదయం కాంగ్రెస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ చేరుకున్నారు. సిట్ ఎదుట ఆయన తన స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, గద్వాల జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జీ సరిత హాజరయ్యారు. వారి స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఈ కేసులో సాక్షులు, బాధితుల వాంగ్మూలాలే కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ శ్రేణుల హడావుడి.. స్వల్ప తోపులాట..

కాంగ్రెస్ నేతలు సిట్ విచారణకు హాజరైన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పీఎస్ వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పీఎస్‌లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని బయటకు పంపించివేశారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. కాంగ్రెస్ శ్రేణుల హడావుడి నేపథ్యంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

బాధితుల స్టేట్‌మెంట్ తర్వాతే కీలక విచారణ..! **

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు రాధాకిషన్‌రావులు ఇవాళ మరోసారి సిట్‌ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. రేపు ప్రణీత్‌రావును విచారించనున్నారు. బాధితుల జాబితాలో ఉన్న కాంగ్రెస్ నేతల వాంగ్ములాల అనంతరం నిందితులను విచారణ చేయనున్నట్లు సమాచారం. బాధితుల స్టేట్‌మెంట్ ఆధారంగా నిందితుల వాంగ్మూలం రికార్డు చేయనున్నట్లు సమాచారం. దీంతో కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

You cannot copy content of this page

Scroll to Top