డయల్ యువర్ కమిషనర్ కు 37 వినతులు
** కమిషనర్ మౌర్య
తిరుపతి: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 37 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా పది మంది తమ సమస్యలు తెలుపగా, 27 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ, కార్పొరేటర్లు శైలజ, నరసింహ ఆచారి, నరేంద్ర లు కమిషనర్ ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, నెహ్రువీధిలో ఇంటి కొళాయి తొలగించినా బిల్లు వస్తోంది పరిష్కరించాలని, వైఎస్ఆర్ మార్గ్ లో టిడిఆర్ బాండ్ ఇప్పించాలని, శ్రీకృష్ణ నగర్ లో చర్చి నుండి వచ్చే శబ్దాల వలన ఇబ్బందులు పడుతున్నాము పరిష్కరించాలని,
రాఘవేంద్ర నగర్ నందు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, రవీంద్ర నగర్ , వెంకటేశ్వర కాలని నందు సిసి రోడ్లు, నీటి సౌకర్యం కల్పించాలని, జగనన్న కాలనీలో తనకు ఇచ్చిన స్థలం రాళ్ళ మధ్యలో ఉంది వేరొక చోట ఇప్పించాలని, మధురానగరిలో కొద్దిపాటి వర్షానికే నీరు చేరుతున్నాయి పరిష్కరించాలని, కోరమేనుగుంటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, చంద్రశేఖర్ కాలనిలో యు డి ఎస్ ఓవర్ఫ్లో అవుతున్నది అరికట్టాలని, చెన్నారెడ్డి కాలనిలో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని, సాయి విష్ణు లే ఔట్ లో ఆక్రమణలు నివారించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, ఫైర్ డి.ఈ.లు, ఏసిపి లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.
