విశాఖలో సీఐటీయూ జాతీయ మహాసభలు
** పోస్టర్ల ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షుడు జయచంద్ర
చంద్రగిరి: సీఐటీయూ అఖిలభారత 18వ జాతీయ మహాసభలు ఈనెల 30 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రగిరి పట్టణంలో మహసభల గోడ పత్రికలను సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎస్.జయచంద్ర, ఇతర నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయచంద్ర మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి కాకలు తీరిన కార్మిక యోధులు ఈ మహాసభకు విచ్చేస్తున్నారు. ఈ మహాసభలో దేశంలో ఉన్నటువంటి ప్రతినిధులు 2500 మంది పాల్గొంటున్నారు. లక్షల మందితో జనవరి 4వ తేదీన విశాఖపట్నంలో పెద్ద బహిరంగ సభ జరుగుతున్నది. ఈ బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మహాసభల్లో కార్మికులకు తీవ్ర నష్టం కలిగే నాలుగు లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తీరుకు వ్యతిరేకంగా పోరాటం రూపొందించడం జరిగింది. అదేవిధంగా కార్మికులకు వేతనాలు పెంపుదలపై చర్చించడం జరుగుతుంది. అలాగే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఆందోళనలు చేయడం జరుగుతుంది. అసంఘటిత కార్మికుల సమస్యలపై సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం వర్తింపుచేయాలని…ఇలా అనేక కార్మిక సమస్యలపై మహాసభలో తీర్మానం చేస్తున్నారు. ఈ మహాసభల్లో ప్రజలు, కార్మికులు, కర్షకులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.చిన్నబాబు, చంద్రగిరి మండల కన్వీనర్ యుగంధర్, ప్రకాష్, రామ్మూర్తి, పెంచలయ్య, చిరంజీవి, గురురెడ్డి, మల్లికార్జున, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
