నవోదయ ఎంట్రన్స్ పరీక్షకు భారీ స్పందన
సూర్యాపేట జిల్లా ప్రతినిధి: నిర్వహిస్తున్న నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది. నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం పొందాలనే ఆశతో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు, వారికి తోడుగా వచ్చిన తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పరీక్ష కేంద్రాల ఎదుట చేరారు. ఉదయం 10:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించగా, అవసరమైన హాల్ టికెట్లు, గుర్తింపు కార్డుల పరిశీలన అనంతరం భద్రతా సిబ్బంది వారి ప్రవేశాన్ని కల్పించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
ఈ నవోదయ ఎంట్రన్స్ పరీక్షను ఉదయం 11:30 గంటల నుంచి 1:30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభానికి ముందే విద్యార్థులు ఆందోళనతో పాటు ఆత్మవిశ్వాసంతో పరీక్ష హాళ్లలోకి ప్రవేశించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పరీక్ష కేంద్రాల బయట వేచి ఉన్నారు. పరీక్ష సజావుగా సాగేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నవోదయ విద్యాలయాల్లో ఉచిత నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు లభించడంతో ఈ పరీక్షకు ప్రతి సంవత్సరం భారీగా దరఖాస్తులు వస్తుండగా, ఈ ఏడాది కూడా విద్యార్థుల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. పరీక్ష అనంతరం ఫలితాలు కేంద్ర నవోదయ విద్యాలయ సమితి ద్వారా ప్రకటించనున్నట్లు సమాచారం.
