భక్తితరంగాల మేళవింపుతో నగర సంకీర్తన
**శనివారం వచ్చిందంటే ఆధ్యాత్మిక చింతనే…
తిరుపతి: పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం ఉదయం భక్తి తరంగాలతో మేల్కొంటోంది. తిరుపతి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం నగరమంతా విరజిల్లాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి సభ్యులు ఘనంగా నగర సంకీర్తనను నిర్వహిస్తున్నారు. ఇందుకు రాయలసీమ రంగస్థలి చైర్మన్ అండ్ బీజేపీ రాష్ట్ర నేత అయిన గుండాల గోపినాథ్ రెడ్డి ముందుండి నగర సంకీర్తనను దేదీప్యంగా సాగిస్తున్నారు.
అందులో భాగంగానే శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ శనివారం రోజున ఉదయం ఐదు గంటలకే వందమందికి పైగా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి, నుదుటిపై గోవింద నామాలతో గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల గుండా నగర సంకీర్తన ప్రారంభమవుతుంది.
“గోవింద… గోవింద…” నినాదాలతో మారుమోగే వీధులు భక్తి రసమయ వాతావరణాన్ని సృష్టిస్తాయి.
చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ హర్షోల్లాసాలతో పాల్గొంటూ నగరమంతా ఆధ్యాత్మిక కాంతిని వ్యాపింపజేస్తు న్నారు. ఈ సంకీర్తన ద్వారా ప్రతి ఇంటిలోనూ భక్తి భావం పెంపొందించాలన్నదే మండలి సభ్యుల లక్ష్యం. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ముగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, కన్నప్ప గారి కేశవులు, చంద్రబాబు నాయుడు , అన్నా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, ముని కోటిరెడ్డి, వాసుదేవ రెడ్డి, పద్మనాభం, నరసింహారెడ్డి, ధనంజయ రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, తొండమునాటి సుబ్రహ్మణ్యం, మధు, పొన్నాల జేజిరెడ్డి, పద్మావతి, శ్రావణి, ఉష, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్ర, కల్పన తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి, ఐక్యత, సేవా భావాల సమ్మేళనంగా సాగుతున్న ఈ నగర సంకీర్తన తిరుపతి నగరానికి ఆధ్యాత్మిక మహిమను మరింతగా చాటుతోంది.
