శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశృతి
భక్తుల తోపులాటలో ఐదుగురికి తీవ్ర గాయాలు
సూర్యపేట జిల్లా : శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా వేములపల్లి మండలం,అమనగల్లులో జరిగిన తొక్కిసలాట ఘటన కలకలం రేపింది. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా నెట్టుకొవడంతో గందరగోళం నెలకొంది. అగ్నిగుండాన్ని దాటుతున్న సమయంలో ఒకరినొకరు నెట్టుకోవడంతో పలువురు భక్తులు నిప్పులపై పడిపోయి గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా భారీగా భక్తులు తరలివచ్చినప్పటికీ, తగిన నియంత్రణ చర్యలు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, దేవాలయ కమిటీ సభ్యులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
