వెట్టిచాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
జిల్లా న్యాయసేవాధికార సంస్థ పిలుపు
శ్రీకాకుళం : జిల్లాలో వెట్టిచాకిరీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్లో వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ‘నేచర్’ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పు తీసుకున్నందుకు ప్రతిఫలంగా తక్కువ వేతనంతో లేదా వేతనం లేకుండా బలవంతంగా పని చేయించుకోవడం నేరమని స్పష్టం చేశారు. వెట్టిచాకిరీ నిర్మూలనను ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలని కోరారు.
సదస్సు అనంతరం అధికారులు కొత్తరోడ్డు సమీపంలోని ఇటుక బట్టీలను సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి, ఎవరైనా వెట్టిచాకిరీకి గురవుతున్నారా అనే అంశంపై ఆరా తీశారు. అసంఘటిత రంగాల్లో కార్మికులు దోపిడీకి గురయ్యే అవకాశం ఉన్నందున, చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నేచర్ ఎన్జీవో ప్రతినిధి జి.కె. దుర్గ, ఐజేఎం ప్రతినిధి కిరణ్, లేబర్ డిప్యూటీ కమిషనర్ అజయ్, శ్రీకాకుళం తహశీల్దార్ గణపతి, బి. గోపాలరావు, ఎస్. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
