పెన్షనర్ల సంఘ భవనంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు..*
మహిళలు రాణిస్తేనే సమాజం సుభిక్షం.ప్రతి కుటుంబంలో మహిళలకు సముచిత గౌరవం, గుర్తింపు లభించినప్పుడే సాధికారత సాధ్యమవుతుందని పలువురు మహిళ ప్రజా ప్రతినిధులు, పెన్షనర్ల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలోని పెన్షనర్ల సంఘ భవనంలో ఉపాధ్యక్షురాలు భ్రమరాంబ అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 12వ వార్డు కౌన్సిలర్ పద్మావతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ నేడు మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో సమానంగా ముందంజలో ఉన్నారని తెలిపారు.
రాజకీయాల్లో సైతం ప్రజా ప్రతినిధులుగా రాణిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని మహిళలు రాణిస్తేనే సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు భూక్య తిరుపతమ్మ, రైతు కూలీల మేస్త్రి పద్మావతి, పారిశుద్ధ్య కార్మికులు ముత్యాలమ్మ, వెంకమ్మలను శాలువా, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉమాదేవి సౌజన్యంతో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భ్రమరాంబ, శోభారాణి, లక్ష్మీ సామ్రాజ్యం, మాజీ కౌన్సిలర్ కొల్లా ప్రసన్నలక్ష్మి, పద్మ, తిరుపతమ్మ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
