విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుంది అని నమ్మిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలే !
సావిత్రిబాయి ఫూలే నిజమైన మొదటి సంఘసంస్కర్త. సమాజం కోసం జీవించి, సమాజం కోసం మరణించిన వ్యక్తి మాత్రమే అసలైన సంఘసంస్కర్త అవుతారు. ఆ ప్రమాణానికి పూర్తిగా సరిపోయిన తొలి వ్యక్తి అని ఎన్.ఎఫ్.ఐ.డబ్లు జాతీయ నాయకురాలు అక్కనేని వనజ తెలియజేసారు. సావిత్రిబాయి ఫూలే 129 వర్ధంతి సందర్భముగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అక్కినేని వనజ తొలుత సావిత్రిబాయి చిత్రపటానికి పూల మల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భముగా వనజ గారు మాట్లాడుతూ ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది.ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని అన్నారు. అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో, ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ప్రారంభించి కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలుగా విస్తరించి స్త్రీ విద్య, అభ్యుదయానికి ఎనలేని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు.
మహిళా సమాఖ్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గంబ మాట్లాడుతూ ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది. లింగ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి “సత్యశోధక్ సమాజ్ “ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పునర్వివాహల కొరకు అసమాన బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు.బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు అన్నారు. అటువంటి సావిత్రిబాయి జీవత స్పూర్తితో ప్రతి మహిళా తన సామాజిక బాధ్యత గుర్తేరిగి సమాజంలో జరుగుతన్న అనేక అన్యాయాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాళ్లు దుర్గాసి రమణమ్మ,చింతాడ పార్వతి,మూలి ఇందిరా,దర్శనం పుష్పవతి బి.శాంతా,రాహేలమ్మ,వేలంగినిరాణి,నాగ మల్లేశ్వరి,ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎం సాయి కుమార్,సాదిక్ బాబు, దీపక్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
