
ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు
14 సంవత్సరాల వయస్సు పూర్తి అయిన కిషోర బాలికలకు భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉచితంగా హెచ్.పి.వి వ్యాక్సిన్
వనపర్తి :
ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి రూపాయల నిధులతో కొత్తగా ఏర్పాటు చేయనున్న సి.టి స్కాన్ – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వైద్యులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎం ఐ డి సి ఇంజనీర్లను ఆదేశించారు. ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, మాతా శిశు సంరక్షణ కేంద్రం సూపరింటెండెంట్ లతో కలిసి కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కోటి రూపాయల నిధులతో కొత్తగా ఏర్పాటు చేయనున్న సి.టి.స్కాన్ సెంటరు, సదరం క్యాంపు కేంద్రాలలో జరుగుచున్న పనుల పురోగతిని పరిశీలించారు. వీటితో పాటు ఆసుపత్రికి అవసరమైన వీల్ చైర్లు, బి.పి. కొలిచే మిషన్లు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చుకోడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా ఆదేశించారు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభోత్సవం చేసుకునే విధంగా సి .టి స్కాన్, సదరం క్యాంపు గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేసి అందులో సమకూర్చాల్సిన యంత్ర సామాగ్రికి వెంటనే ఆర్డరు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
శిథిలావస్తలో ఉన్న పాత క్షయ వ్యాధి వార్డు గదులను తొలగించండి
ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతకు ముందు ఉన్న పాత క్షయ వ్యాధి భవనం పూర్తిగా శిలావస్థకు చేరుకున్నందున రోడ్లు భవనాల ఇంజనీరు ఆమోదంతో భవనాన్ని తొలగించాలని సూచించారు. వర్షాకాలంలో తడిచి కూలిపోయే ప్రమాదం ఉన్నందున అంతకంటే ముందే శిథిలాలను తొలగించాలని సహాయ ఇంజనీరును ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హెచ్.పి.వి. వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు ఎంత మంది కీశోర బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చారు, బాలికల వెంట తల్లిదండ్రులు వస్తున్నారా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సరు వ్యాధి ఎప్పటికీ రాకుండా ఉండటానికి ప్రస్తుతం 14-15 సంవత్సరాల కిషోర బాలికలకు హెచ్.పి.వి. వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అమ్మాయిలు కేవలం ఒకసారి మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే జీవితంలో ఎప్పుడూ క్యాన్సర్ దరిచేరదు.
ఇంతటి మహత్తరమైన ఈ వ్యాక్సిన్ పట్ల తల్లిదండ్రులు, కిషోర బాలికలకు అవగాహన కల్పించి ప్రతి కిషోర బాలికకు సురక్షితమైన హెచ్.పి.వి వ్యాక్సిన్ ఇప్పించి సర్వైకల్ క్యాన్సర్ నుండి కాపాడుకునేవిధంగా చూడాలని వైద్య సిబ్బందిని సూచించారు. అంతకు ముందు కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తనకు సి.బి.పి. , హెచ్.బి.1 రక్త పరీక్షలు చేయించుకున్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా సాయినాథ్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. అరుణ కుమారి, డా. పరిమళ, ఇతర వైద్య సిబ్బంది, తెలంగాణ యం.ఐ.డి.సి సహాయ ఇంజనీరు శివ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.