
వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి – సూర్యాపేట రూరల్ ఎస్సై బాలు నాయక్
సూర్యాపేట జిల్లా ప్రతినిధి: ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూర్యాపేట రూరల్ ఎస్సై బాలు నాయక్ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని జాతీయ రహదారిపై జనగామ క్రాస్ రోడ్డు వద్ద “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై బాలు నాయక్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అవగాహన లోపం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. ప్రయాణానికి ముందు వాహనానికి సంబంధించిన అన్ని అనుమతి పత్రాలు (డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్) కలిగి ఉండాలని, నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని సూచించారు. ప్రయాణ సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం “శ్రీరామరక్ష” లాంటిదని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రోడ్డు మీద బాధ్యతగా వ్యవహరించడం ప్రతి వాహనదారి కర్తవ్యమని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని కోరారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని, వేగం నియంత్రణలో ఉంచి పరిస్థితులను అంచనా వేస్తూ వాహనం నడపాలని చెప్పారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తగా ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఎస్సై స్పష్టం చేశారు.