
“సాహిత్య రంగంలో కొత్త శిఖరాలు అధిరోహిస్తున్న తూము నర్సయ్య, కలెక్టర్ అభినందనలు…”
పెద్దపల్లి :
ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత తూము నర్సయ్య సాహితీ కృషిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. ‘నేను మీ నాను’ అనే పుస్తకాన్ని రచించిన సందర్భంగా నర్సయ్యను ప్రత్యేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా స్థాయిలో జరిగే పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, తన వాక్చాతుర్యంతో అతిథులను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారని కలెక్టర్ కొనియాడారు. నర్సయ్య రచనలు సామాజిక స్పృహను, మానవ విలువలను, ప్రకృతి సౌందర్యాన్ని, ప్రేమానురాగాలను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.
క్లిష్టమైన భావాలను కూడా సరళమైన పదాలతో సామాన్యులకు అర్థమయ్యేలా వ్యక్తీకరించడం నర్సయ్య ప్రత్యేకత అని, ఆయన కవితలు పాఠకులను ఆలోచింపజేస్తాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ‘నేను మీ నాను’ పుస్తక రచనపై నర్సయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని కవితా సంపుటాలను వెలువరించాలని, సాహితీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.