
రామగుండంలోని జంగాలపల్లిలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన
….
పెద్దపల్లి //రామగుండం: నెలాఖరులోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలి…..
జంగాలపల్లిలో మౌలిక వసతులపై దృష్టి, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు చర్యలు….
— కలెక్టర్ కోయ శ్రీహర్ష….
రామగుండం మండలంలోని జంగాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ నెలాఖరులోగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
జంగాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణశ్రీతో కలిసి పరిశీలించిన కలెక్టర్, అక్కడి మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇళ్ల వద్ద తాగునీరు, విద్యుత్, రహదారులు వంటి ప్రాథమిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని స్పష్టం చేశారు.
అనంతరం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాలపల్లి, పాములపేటలో ప్లాట్లు పొందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
తదుపరి రామగుండం మండలంలోని న్యూ మారేడుపాకలోని ఆర్ & ఆర్ కాలనీని పరిశీలించి, ఆ భూములను రెవెన్యూ శాఖకు కేటాయించి, ఆర్ & ఆర్ పట్టాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గంగయ్య, రామగుండం తహసీల్దార్ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.