
“గుడ్ మార్నింగ్ రామగుండం… పైలట్, కో పైలెట్ ఎక్కడ…?”
వార్డు సమస్యలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని,
రామగుండం నగరంలోని 51వ.డివిజన్లో నెలకొన్న డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలపై స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఉదయం స్వయంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. కాలనీలో పేరుకుపోయిన మురుగు నీరు, చెత్త సమస్యలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“గుడ్ మార్నింగ్ రామగుండంలో పైలట్…. కో పైలెట్ ఎక్కడ?” అంటూ అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం అసలు సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ప్రతి వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.
డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార మార్గాలను అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.