
తిరుపతి ట్రాఫిక్ కష్టాలకు చెక్
** ఎంపీ గురుమూర్తి కృషితో రైల్వే అండర్ బ్రిడ్జి
తిరుపతి: ఆధ్యాత్మిక నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలకమైన ఎల్సీ నం.107 పాత హీరో హోండా షోరూం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ అండర్ బ్రిడ్జ్ ద్వారా నగర ట్రాఫిక్కు భారీ ఉపశమనం కలగనుంది. ఇదే సమయంలో కొత్తగా మంజూరు అయిన అప్రోచ్ రోడ్డు పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ అండర్ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే తిరుపతి నగరంలో ట్రాఫిక్ మరింత మెరుగుపడుతుంది.
2022లోనే ఎంపీ చొరవ
భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని గుర్తించి ఎంపీ మద్దిల గురుమూర్తి తాను ఎంపీగా ఎన్నికైన తొలినాళ్లలో 2022 సంవత్సరంలోనే ఎల్సీ నం.107 వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణం అత్యవసరమని దక్షిణ మధ్య రైల్వే అధికారులకు తెలియజేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంగా ఉండడం, లెవల్ క్రాసింగ్ వద్ద తరచూ గేట్లు మూయడం వలన నగరంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడం, ముఖ్యంగా అత్యవసర సేవలకు అంతరాయం కలగడం వంటి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి పట్టణానికి ఓ వైపు వాణిజ్య కేంద్రాలు, హోటళ్లు, విద్యాసంస్థలు ఉండగా, మరో వైపున వేలాది కుటుంబాలు నివసించడం వల్ల ఈ మార్గం అత్యంత కీలకమని సంబందిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
తరువాత 2023లో ఈ సమస్యను మరింత ప్రాధాన్యతతో తీసుకుని, రోడ్డు వెడల్పు చేసే అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రైల్వే గేట్లు మూసినప్పుడు ప్రధాన రహదారి పూర్తిగా బ్లాక్ అవుతూ అంబులెన్సులు సైతం సమయానికి ఆసుపత్రులకు చేరలేని పరిస్థితిని ఆయన అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో రైల్వే శాఖ కూడా సమస్య తీవ్రతను గుర్తించి, ఎల్సీ నం.107 వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది.
అయితే, అండర్ బ్రిడ్జ్కు ఒక వైపు మాత్రమే అప్రోచ్ రోడ్ ఉండటం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాన్ని గుర్తించి, మరో వైపు అదనపు అప్రోచ్ రోడ్ అవసరాన్ని 2025లో ప్రస్తావించారు. తిరుపతి నగరం వేగంగా విస్తరిస్తుండటం, మంగళం, కొత్త రహదారుల అభివృద్ధి వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర పరిష్కారం అవసరమని వివరించారు. దీనికి అనుగుణంగా రైల్వే శాఖ కూడా అదనపు అప్రోచ్ రోడ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆర్యూబీ నిర్మాణం పూర్తి దశకు చేరుకోవడం, అప్రోచ్ రోడ్ల పనులు ప్రారంభం కానుండటంతో తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రైల్వే గేట్ల కారణంగా ఏర్పడే ఆలస్యం పూర్తిగా తొలగిపోవడంతో పాటు, అత్యవసర సేవలు వేగంగా అందుబాటులోకి రావడం, ప్రజలకు సురక్షితమైన ప్రయాణం కలగడం వంటి అనేక ప్రయోజనాలు అందనున్నాయి. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నిరంతరం అనుసరణతో, దశలవారీగా సమస్యను ముందుకు తీసుకెళ్లి, సబ్వే ప్రతిపాదన నుండి ఆర్యూబీ నిర్మాణం వరకు, అనంతరం అదనపు అప్రోచ్ రోడ్ల ఆమోదం వరకు సాధించిన ఈ విజయాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. నగర అభివృద్ధి, ప్రజల సౌకర్యం దృష్ట్యా ఆయన చేసిన కృషి తిరుపతి ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో కీలక మైలురాయిగా నిలిచింది.