వనపర్తి పట్టణంలో అధునాతన పద్ధతుల్లో నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్ ను ఉపయోగంలో తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టర్ తన ఛాంబర్ లో మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, మున్సిపల్ కమిషనర్ తో సమావేశం ఏర్పాటు చేశారు.
పట్టణంలో అన్ని సదుపాయాలతో అధునాతనంగా సమీకృత మార్కెట్ నిర్మించడం జరిగింది. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో 32 కమర్షియల్ షాపులు, ఒక బ్యాంక్, ఒక సూపర్ మార్కెట్ పెట్టుకోడానికి అవకాశం కలదు.
మొదటి అంతస్తులో 49 కమర్షియల్ షాపులు, ఒక బ్యాంకెట్ హాల్ పెట్టుకోడానికి నిర్మాణం జరిగింది. వీటితో పాటు విద్యుత్, తాగు నీరు, మరుగుదొడ్లు వంటి అన్ని సదుపాయాలతో దాదాపు 80 మంది కూరగాయల వ్యాపారులు కురుగాయలు అమ్ముకోవడానికి 6 ప్లాట్ ఫారం లు ఏర్పాటు చేయడం జరిగింది. చికెన్, మటన్ అమ్ముకునే వారికి 13 షాపులు ఏర్పాటు చేయడం జరిగింది.
వీటన్నింటికి టెండర్ ద్వారా షాపులు, బ్యాంక్, సూపర్ మార్కెట్ తదితర వ్యాపారస్తులకు కేటాయించి సమీకృత మార్కెట్ ను ఉపయోగంలోకి తీసుకురావాలని మార్కెటింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
కూరగాయలు అమ్ముకునే వ్యాపారస్తులకు ప్లాట్ ఫారం లు ఉచితంగా ఇవ్వడంతో పాటు విద్యుత్, తాగు నీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని అందువల్ల ఇప్పుడు బయట రోడ్డు పై అమ్ముకుంటున్న కూరగాయల రైతులు సమీకృత మార్కెట్ లో కూర్చుని అమ్ముకునే విధంగా తరలించాలని ఆదేశించారు.
వ్యాపారస్తులు కమర్షియల్ షాపులు, బ్యాంకెట్ హాల్, సూపర్ మార్కెట్ పెట్టుకునే విధంగా ప్రకటన ద్వారా ప్రచారం కల్పించాలని మార్కెటింగ్ అధికారిని సూచించారు.
జిల్లా మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్, డిప్యూటీ ఎల్డియం సాయి తదితరులు పాల్గొన్నారు.