గతమంతా కుటుంబ పాలనే!
** తిరుపతిలో కేంద్ర మంత్రి బండి సంజయ్
తిరుపతి: దేశంలో 2014కు ముందువరకు పూర్తిగా కుటుంబ పాలనే ఎక్కువగా సాగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన, పేదల సంక్షేమంలో 11 సంవత్సరాల పాలనపై తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రజా అవగాహన కార్యక్రమానికి కేంద్ర మంత్రి బుధవారం హాజరయ్యారు. మంత్రికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిపల్లి భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గుండాల గోపినాధ్ రెడ్డి, నేతలు నవీన్ కుమార్ రెడ్డి, అజయ్ కుమార్, కోలా ఆనంద్, వరప్రసాద్ తదితరులు గజ మాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరుమల బైపాస్ రోడ్డులోని కె.బి.ఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన అవగాహన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ పథకాలను బిజెపి నాయకులు మారుమూల పల్లెలకు సైతం తీసుకెళ్లి ప్రజలకు మేలు చేయాలన్నారు. పథకాల ఫోటో ప్రదర్శనను బండి సంజయ్ ప్రారంభించి తిలకించారు.
నారీ శక్తికి మరింత ప్రోత్సాహం, పేద బడుగు, బలహీన వర్గాలకు సేవ లాంటి ఎన్నో సంక్షేమ, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలతో దారిద్ర్య రేఖకు దిగువనున్న కోట్లాదిమంది ప్రజల జీవితాలలో వెలుగుని నింపిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని చెప్పారు. దేశ ప్రజల ప్రియతమ నేతగా మన ప్రధాని నాయకత్వంలో వికసిత్ భారత్ గా… అగ్రరాజ్యాలకు దీటుగా పోటీ పడుతూ భారతదేశంలో బిజెపి సుపరిపాలన అందిస్తున్నదన్నారు. సాయంత్రం పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలో మంత్రి మొక్కలను నాటారు. పచ్చదనం పెంపుతోనే మానవ మనుగడ ఆరోగ్యప్రదం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు నవీన్ కుమార్ రెడ్డి, గుండాల గోపినాధ్ రెడ్డి, పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
