శాంతిభద్రతల విఘాతమే జగన్ లక్ష్యమా…?!
** అరెస్టుల భయంతోనే పొలిటికల్ గేమ్ లు
చిత్తూరు: పీకల్లోతు అవినీతి కేసుల్లో కూరుకుపోయిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి కేసుల్లో అరెస్టుల నుంచి ప్రజల దృష్టి మళ్ళించి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించడమే లక్ష్యంగా పొలిటికల్ గేమ్ లకు తెర తీశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ మండిపడ్డారు. మద్యం కేసులు, ఫోన్ ట్యాపింగ్ విచారణలు, సీబీఐ కేసుల్లో దూకుడు పెరిగిన నేపథ్యంలో జగన్ బ్యాచ్ లో ఆమదోళన నెలకొన్న విషయాలపై సురేంద్ర కుమార్ బుధవారం చిత్తూరులో మీడియా సమావేశం నిర్వహించారు.
గత సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే హీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బెట్టింగ్ చావుకి రాజకీయ ముద్ర వేసి పరామర్శ పేరుతో వేలాది మందిని ప్రోగు చేసుకొని సంబరాలు, డాన్సులు వేయిస్తూ దండయాత్రలా రెంటపల్లెకు జగన్ వెళ్లడమా ? ఇదేనా పరామర్శ తీరు ? అని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఏడాదిలో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకుండా శవ రాజకీయాలు చేస్తూ, అభివృద్ధిని అడ్డుకునేందుకు రోజుకో కుట్ర చేస్తున్న జగన్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
వ్యక్తిగత కారణాలతో జరిగిన ఆత్మహత్యను కూడా రాజకీయం చేయడాన్ని పల్నాడు ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని పేర్కొన్నారు. విశాఖలో జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే సమయంలో అల్లర్లు సృష్టించే కుట్రలో భాగమే సత్తెనపల్లిలో దండయాత్ర చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు.
సంవత్సర క్రితం బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చే ముందు పరామర్శించడం దేనికి సంకేతం జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు. శాంతిభద్రత లకు, పాలనా వ్యవహారా లకు విఘాతం కలిగించకుండా రాష్ట్రంలో ఎక్కడైనా జగన్ రెడ్డి యథేచ్ఛగా తిరగవచ్చని…..కానీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రాష్ట్ర ప్రతిష్టతకు చెడ్డపేరు తీసుకువస్తుంటే సహించేది లేదని హెచ్చరించారు. దేశం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేసే వాళ్ళకంటే, బెట్టింగ్ రాయుళ్లు, 420లు, గుండాగిరి, దాదాగిరి, హత్యలు, మానభంగాలకు, భూకబ్జాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే నేరస్థులంటేనే జగన్ రెడ్డికి ఎంత ముద్దో అతని పర్యటనల ద్వారా బహిర్గతం అయిందని విమర్శించారు. పొగాకు రైతుల పరామర్శ పేరుతో పొదిలికి 40 వేల మంది వైసీపీ రౌడీ మూకలను తీసుకువచ్చి, శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై చెప్పులు, రాళ్లు, బీరు బాటిళ్లతో జగన్ రెడ్డి దాడి చేయించారని ఆరోపించారు.
అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో హెలికాప్టర్ పేరుతొ డ్రామాకు తెరలేపాడని దుయ్యబట్టారు. పథకం ప్రకారం వైసీపీ మూకలతో హెలీకాఫ్టర్పై దాడి చేయించుకొని పోలీసుల వైఫల్యం అంటూ తప్పుడు ప్రచారం చేశాడన్నారు. జగన్ కుట్ర ఆలోచనలతోనే రాష్ట్రంలో రాజకీయ పర్యటనలు చేస్తున్నాడని పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా జరిగిన ఏ ఘటన చూసుకున్నా… జగన్ పర్యటనల వెనుక కుట్ర కోణం ఉందన్నారు.
గొడవలు సృష్టించడం.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పడమే జగన్ కుట్ర. ఇలా రాజకీయం చేసే
జగనుకు రౌడీలు, గుండాలు అవసరం ఉంది. అందుకే రౌడీ షీటర్లకు మద్దతు పలుకుతున్నాడని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల భద్రత, సంక్షేమమే ముఖ్యమని వెంకిటీల పునరుద్ఘాటించారు.
