ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజా

TEJA NEWS

ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజా

** అధికారుల సమీక్షలో టీటీడీ ఈవో

తిరుపతి: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో అలిపిరి చెక్ పాయింట్ పునరుద్ధరణ, భద్రత పెంపుపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈవో బుధవారం సమీక్ష నిర్వహించారు. ముందుగా అలిపిరి టోల్ ప్లాజా వద్ద ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత తదితర అంశాలపై జిఎంఆర్ గ్రూప్‌ నకు చెందిన రాక్సా సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భక్తుల చెకింగ్, లగేజీ స్కానింగ్ కి ప్రస్తుతం తీసుకుంటున్న సమయం, దాని వల్ల వస్తున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వేగంగా వాహనాలు, లగేజీ స్కానింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని జీఎంఆర్ అనుబంధ సంస్థ అయిన రాక్సా సంస్థ ప్రతినిధులకు ఈవో సూచించారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద చెకింగ్ సమయాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు.

విజిలెన్స్ విభాగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని భక్తుల లగేజీ, వాహనాల స్కానింగ్ లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించారు. తనిఖీ సమయంలో క్రాస్ ఓవర్‌లను నివారించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పుడు ఉన్న లగేజీ స్కానర్ల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్కానర్లు ఏర్పాటు చేయాలన్నారు.
స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లగేజీ స్కానర్లను పెంచాలని కోరారు. టోల్ ప్లాజాలోని చివరి రెండు భద్రతా లేన్‌లలో మరింత మంది భద్రతా సిబ్బంది నియామకం జరగాలని సూచించారు. రాబోయే 20 సంవత్సరాల పాటు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా అంశాల ప్రతిపాదనలు సూచించాలని రాక్సా ప్రతినిధులను ఈవో కోరారు.
ఈ కార్యక్రమంలో రాక్సా సీఈవో అమిత్ దార్, జేఈవో వీరబ్రహ్మం, సీవిఎస్వో మురళీ కృష్ణ, సీఈ సత్యనారాయణ, ఈఈ వేణుగోపాల్, ఐటీ జీఎం శేషారెడ్డి, వీజీవోలు సదా లక్ష్మి, రామ్ కుమార్, సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top