వకుళామాతకు బంగారు పూత కిరీటం బహుకరణ
తిరుపతి: తిరుపతి సమీపాన పేరూరు బండపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి తల్లియైన శ్రీ వకుళామాత ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్బంగా హైదరాబాద్ కు చెందిన ఆర్. అమరనాథ్, శైలజ దంపతులు అమ్మవారికి రూ. 4.50 లక్షల విలువైన బంగారు పూత పూసిన వెండి కిరీటాన్ని ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మీకి అందించారు. ఆలయ 3వ వార్షికోత్సవ పూజలు శాస్త్రోక్తంగా ఉదయం నుండి రాత్రి వరకు కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 5.30 గం.ల నుంచి 6 గం. ల వరకు సుప్రభాతం, ఉదయం 06 – 08 గం.ల వరకు నిత్య కైంకర్యాలు, మూలవర్లకు అభిషేకం, అలంకారం, నివేదన చేపట్టారు. ఉదయం 09 గం.ల నుంచి 11 గం.ల వరకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనము, అంకురార్పణం, మహా శాంతిహోమం, పూర్ణాహుతి పూజలను నిర్వహించారు. ఉదయం 11. గం.ల నుంచి 12 గం.ల వరకు ఉత్సవ మూర్తులకు అష్టోత్తర శతకలశాభిషేకం, మధ్యాహ్నం 12 గం.ల నుండి 01.00 గం. వరకు శుద్ధి, అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్పెక్టర్ శివప్రసాద్, భక్తులు పాల్గొన్నారు.
