పల్లెల్లో కనబడుతున్న అభివృద్ధి అంతా బీఆర్ఎస్ పాలనలో జరిగిన దే
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటైన విమర్శలు
డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలంలోని గుండ్రాతిమడుగు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రజాభిమాన యాత్ర నిర్వహించిన మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రచారాన్ని వేడెక్కించారు. స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, సర్పంచ్ అభ్యర్థి శావ దివ్యకు బ్యాట్ గుర్తుకు గెలుపు అందించాలని ఇంటింటికీ తిరిగి ఓటు కోరారు.
ప్రజా సభలో మాట్లాడుతూ సత్యవతి రాథోడ్ ప్రభుత్వంపై సూటిగా, గట్టిగానే విరుచుకుపడ్డారు—
● “100 రోజుల్లో 6 గ్యారంటీలు అని గొప్పలు చెప్పి… మాట తప్పి, వాగ్దానాలు విసిరి పారేసి… ఇప్పుడు రోజుకో ఈవెంట్ పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించే ఈవెంట్ మేనేజ్మెంట్ సర్కారు రెండు ఏళ్లు పూర్తి చేసుకున్నా గ్రామాలు ఇంకా అదే బాటలోనే ఉన్నాయి” అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
● “రెండు సంవత్సరాల కాలంలో ఒక్క పెద్ద పనైనా చేసి ఉంటే గ్రామాల్లో కనిపించేది. కానీ ప్రజలు చూస్తున్న అభివృద్ధి అంతా — రోడ్లు, పంచాయతీ భవనాలు, చెరువులు, డబుల్ బెడ్రూములు — ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పదేళ్ల ఫలితాలే” అని స్పష్టం చేశారు.
● “ప్రజలకు మోసం చేయడానికి ఈవెంట్లు కాదు… నిజమైన అభివృద్ధి కావాలి. బీఆర్ఎస్ మళ్లీ బలపడితేనే గ్రామాలకు బంగారు రోజులు వస్తాయి” అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో యస్ కె రంజాన్, బస్వ శ్రీను, కొత్త ఉపేందర్, చిర్రాబోయిన బిక్షం, ఎం.వి. గౌస్, మైసయ్య, దాసరి సురేష్, రాగం వీరేష్, పెద్దోజు వెంకట చారి తదితరులు పాల్గొన్నారు.
