“శక్తి టీం” ద్వారా విద్యార్థులకు అవగాహన
తిరుపతి: జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డియస్పి సూచనలతో “శక్తి టీం” సభ్యులు మిట్టపాలెం పల్లెలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, క్రమశిక్షణ, నైతిక విలువలు గురించి వివరించి అవగాహన కల్పించారు. అలాగే గుర్తుతెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం, ఇంటి చుట్టుపక్కల అపరిచితులు ఇచ్చే తినుబండారాలు తీసుకోకూడదని సూచించారు. అదనంగా మొబైల్ ఫోన్ను అధికంగా వినియోగించడం వల్ల కలిగే నష్టాలు, మొబైల్ గేమ్స్కు అలవాటు పడటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు, తెలియని లింక్లపై క్లిక్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి విద్యార్థులకు వివరించారు. చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్ వంటి అంశాలపై చట్టపరమైన అవగాహన కల్పించి, అత్యవసర పరిస్థితుల్లో చైల్డ్ లైన్ – 1098, పోలీస్ హెల్ప్ లైన్ – 112 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
