తిరుమల భ‌ద్ర‌త‌కు మరింత మెరుగైన వ్యవస్థ** టీటీడీ ఈఓతో ఉన్న‌త‌స్థాయిసమీక్షలో డీజీపీ

TEJA NEWS

తిరుమల భ‌ద్ర‌త‌కు మరింత మెరుగైన వ్యవస్థ
** టీటీడీ ఈఓతో ఉన్న‌త‌స్థాయి
సమీక్షలో డీజీపీ

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని… అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకత నేపథ్యంలో మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరిష్ కుమార్ గుప్తా,సూచించారు. తిరుమలలో ఇప్పుడు అమలవుతున్న భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలనే అంశం పై టీటీడీ ఈవో శ్యామల రావు సమక్షంలో
శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఉన్నత స్థాయి భద్రత సమావేశం
జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలో ముందుగా తిరుపతి ఎస్పీ కమ్ టీటీడీ ఇన్ ఛార్జ్‌ సీవీఎస్వో హర్షవర్ధన్ రాజు భద్రతా అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఏపీఎస్పీ, డీఏఆర్‌, ఎస్పీఎఫ్‌, హోంగార్డు, సివిల్ పోలీసు, టీటీడీ సెక్యూరిటీతోపాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని సూచించారు. అలిపిరి వద్ద బహుళ స్థాయి వాహన తనిఖీ వ్యవస్థ, డిఫెన్స్ ఏజెన్సీలతో కలసి సెన్సార్ ప్లే సిస్టమ్, ఆధునిక భద్రతా పరికరాలు, సైబర్ భద్రత వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా ఆయన చ‌ర్చించారు.


అనంతరం టీటీడీ ఈవో శ్యామల రావు మాట్లాడుతూ భద్రతపై అనుబంధ ఏజెన్సీలతో ఒక సమన్వయ వ్యవస్థ అవసరమని అభిప్రాయ పడ్డారు. తిరుమలలో సైబర్ భద్రతా వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాల‌ని పేర్కొన్నారు. విస్తృతస్థాయిలో తిరుమల భద్రతా సమీక్ష నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ సుధాకర్ రెడ్డి, అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్ మహేష్ చంద్ర లడ్హా , అనంత‌పురం రేంజ్ డీఐజీ డా.శేముషి, ఐఎస్ డ‌బ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, డీఎఫ్ఓ వివేక్ ఆనంద్, వివిధ భద్రతా బ‌ల‌గాల‌ అధికారులతో పాటు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌద‌రి, టీటీడీ నిఘా – భద్రత అధికారులు, వివిధ విభాగాల
టీటీడీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top