డ్వాక్రా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్ లు పంపిణీ
తిరుపతి: తిరుపతి మెప్మా పరిధిలో పనిచేస్తున్న స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) రిసోర్స్ పర్సన్ (ఆర్.పి) లకు తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మహిళలు సాంకేతికతను అందిపుచ్చు కుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మహిళా సాధికారిత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. మొత్తం 169 ఆర్పీలకు గాను 153 మందికి ట్యాబ్ లు ఆయన అందచేశారు. ట్యాబ్ లో 60 యాప్ లు ఉన్నాయని, అన్నీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సర్వేలకు సంబంధించినవని ఆయన చెప్పారు.
ఇకపై ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ యాప్ ద్వారానే అందించాలని సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లు నిర్ణయించారని ఆయన తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాలను పారదర్శకంగా చేరవేయాలని ఆయన కోరారు. అందుకు సాంకేతికంగా వస్తున్న మార్పులను మహిళలు త్వరగా నేర్చుకుని పురుషలతో పోటీ పడాలని ఆయన సూచించారు. మహిళలకు ఏకాగ్రత ఎంతో ఎక్కువని ఆయన చెబుతూ మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమి లేదని అన్నారు. కాగా 130 మంది డిజీ లక్ష్మీలకు బయోమెట్రిక్ డివైజ్ లను ఆయన అందించారు. స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లో మహిళలు రాణించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుందని వాటిని మహిళలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఎంఎం లు కృష్ణవేణి, సోమశేఖర్, డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, సిఓలు తదితరులు పాల్గొన్నారు.
