
అనుమతులు లేని నిర్మాణాలపై కొరడా
** ఇన్ చార్జి కమిషనర్ శారదాదేవి
తిరుపతి: నగరంలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలను ముందే గుర్తించి నిలుపుదల చేయాలని… నిబంధనలు పాటించనివారి పట్ల కొరడా జులపాల్సి ఉంటుందని తిరుపతి మున్సిపల్ ఇన్ చార్జి కమిషనర్ శారదా దేవి హెచ్చరించారు. గురువారం నగరంలోని పోస్టల్ కాలనీ, నారాయణ పురం, డి.బి.ఆర్ రోడ్డు, చింతలచేను, కైకాల చెరువు తదితర ప్రాంతాల్లో ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులతో పాటు, నిర్మాణాలను పరిశీలించారు. నగరంలోని ఫుట్ పాత్ ఆక్రమణలు, అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని తెలిపారు. పట్టణ ప్రణాళిక అధికారులు, సిబ్బంది నగరంలో పర్యటిస్తూ అనుమతులు లేని నిర్మాణాలు గుర్తించి ముందే అడ్డుకోవాలని కోరారు. ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కమిషనర్ వెంట డీఈఈ శిల్ప, తేజస్విని, ఏసీపీ పార్వతి ప్రియ, స్వర్ణ వార్డు కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.