
పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం
పాలసముద్రం / తిరుపతి: ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తారని “రూరల్ యాక్షన్ ఫర్ సోషల్ సర్వీస్” సంస్థ ప్రధాన కార్యదర్శి పావులూరు చిట్టిబాబు అన్నారు. వరల్డ్ జీరో వేస్ట్ కార్యక్రమంలో భాగంగా పాలసముద్రం మండలం
వనదుర్గాపురం పంచాయతీ లో భూమిహిత కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా “అమ్మాక్ట్స్” సంస్థ సహకారంతో రూరల్ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించి శుభ్రం చేశారు. అలాగే వాహనాలు రాకపోకలు సాగించే దారిలో ముళ్ల చెట్లను తొలగించారు. గ్రామాల్లో అందరూ పరిశుభ్రతను పాటిస్తూ మరుగుదొడ్లను వాడాలని సూచించారు. వీధులకు, రోడ్లకు పక్కన మల, మూత్ర విసర్జన చేయకుండా అవగాహనతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూమి హితులు వరదరాజులు, ఉమా, రుక్మిణి, లక్ష్మీ, కనక, ఆర్గనైజర్ నాగరాజు, గ్రామస్తులు సుబ్రహ్మణ్యం యాదవ్, శేఖర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.