విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాముఖ్యత
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాముఖ్యతను కల్పించాలని, అవసరమైన పక్షంలో కొత్త ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులకు సూచించారు. ట్రాన్స్ కో ఉత్తర మండలం సర్కిల్ అధికార యంత్రాంగం సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్ తో మోండా మార్కెట్ లోని ఆయన నివాసంలో సామవేశమైంది. సూపర్ ఇంటేన్దింగ్ ఇంజనీర్ గోపయ్య నేతృత్వంలో డివిజనల్ ఇంజనీర్ బ్రహ్మానందం, ఏ డీ ఈ లు మహేష్ కుమార్, దుర్గా ప్రసాద్, సెక్షన్ ఇంజనీరింగ్ అధికారులు శ్రీకాంత్, వరలక్ష్మి, కృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పంపిన సందేశం, శుభాకాంక్షలను ఎస్.ఈ. గోపయ్య తదితరులు పద్మారావు గౌడ్ కు అందించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా విద్యుత్ శాఖ కార్యకలాపాలను విస్తరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
