ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు దూరం… అవగాహన లోపమా? ప్రచార లోపమా?
గ్రామసభలు, రైతువేదికల్లో సదస్సులకు ఆసక్తి చూపని ప్రజలు
సూర్యపేట జిల్లా ప్రతినిధి : ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ వాటికి ప్రజల స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే గ్రామ సభలు, రైతుల అవగాహన సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి వాటికి ప్రజల హాజరు చాలా తక్కువగా ఉండటం గమనార్హంగా మారింది. సాధారణంగా ప్రజలకు ఉపయోగపడే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. అయితే చాలా సందర్భాల్లో ప్రజలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉండడం, అలాగే ఈ కార్యక్రమాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల హాజరు కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు సంబంధిత శాఖల అధికారులు కూడా కార్యక్రమాల గురించి సమర్థవంతంగా ప్రచారం చేయడంలో విఫలమవుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేవలం వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపించడం ద్వారా బాధ్యత పూర్తయిందని భావిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
గ్రామస్థాయిలో ముందుగా తెలియజేసే విధంగా దండోరా వేయించడం, మైక్ ప్రకటనలు చేయించడం, గ్రామ పెద్దలు మరియు సంఘాల ద్వారా సమాచారం అందించడం వంటి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సమాచారం చేరకపోవడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాల ప్రాధాన్యం తెలియకుండా పోతుందని, అందుకే చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారని సామాజిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే అధికారులు గ్రామస్థాయిలో మరింత చురుకుగా ప్రచారం చేయడం, ప్రజల్లో అవగాహన పెంచే చర్యలు చేపట్టడం అవసరమని ప్రజలు సూచిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా ఫలితాలను ఇవ్వాలంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అప్పుడు మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం పెరిగి ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని వారు భావిస్తున్నారు.
