నేటి నుండి నుండి ప్రారంభం కానున్న ప్రజా పాలన…..
పెద్దపల్లి//గోదావరిఖని :శుక్రవారం నుండి ప్రారంభం కానున్న ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలని, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. ఈ మేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రత ,పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ లక్ష్యంగా ఈ నెల 6 నుండి 15 వరకు నగర పాలక సంస్థ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు.
మొదటి రోజు శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ విచ్చేస్తున్నారని అన్నారు. కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు,సిబ్బంది పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమం లో భాగంగా పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రోడ్లు, కాలువలు శుభ్రం చేయడం, వాహనాల మరమ్మత్తులు, నీటి సరఫరా సమస్యల పరిష్కారం,అన్ని వీధి దీపాలు వెలిగేలా చూడడం తదితర అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డివిజన్ లలో ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి కార్పొరేటర్లు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఎస్ ఇ గురువీర, ఇ .ఇ. పివి. రామన్, డిప్యూటీ కమీషనర్ నాయిని వెంకట స్వామి, ఆసిస్టెంట్ కమీషనర్ వెంకటేశ్వర్లు, డి.ఇ. షాబాజ్, టిపిఎస్ నవీన్,ఆర్ ఓ ఆంజనేయులు , ఎ .ఇ తేజస్విని, మెప్మా టి ఎం సి మౌనిక తదితరులు పాల్గొన్నారు.
