
రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్ల ఆస్తి పన్ను వసూళ్లలో అగ్ర స్థానంలో నిలిచిన రామగుండం కార్పొరేషన్….
పెద్దపల్లి//గోదావరిఖని: రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్ల ఆస్తి పన్ను వసూళ్లలో రామగుండం నగర పాలక సంస్థ అత్యధిక శాతం వసూళ్లు సాధించి కార్పొరేషన్ కేటగిరీ లో అగ్ర స్థానంలో నిలిచింది.
మార్చి 31, 2026 తో ఆర్థిక సంవత్సరం గడువు ముగిసేనాటికి 75.28 శాతం పన్నువసూళ్లు సాధించింది. ఆర్థిక సంవత్సరం 2025-26 కు సంబందించి ఆస్తి పన్ను మొత్తం డిమాండ్ రూ. 19 కోట్ల 22 లక్షల 97 వేలు కాగా రూ. 14 కోట్ల 47 లక్షల 67 వేలు వసూలయ్యాయి. దీంతో ఆర్థిక సంఘం పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్ పొందడానికి కూడా రామగుండం నగర పాలక సంస్థ అర్హత సాధించింది.
మెరుగైన ఆస్తి పన్ను వసూళ్లు సాధించినందుకు నగర పాలక సంస్థ వార్డు అధికారులు , వార్డు అసిస్టెంట్ లు , రెవెన్యూ విభాగం సిబ్బందిని నగర మేయర్ మహంకాళి స్వామి , కమిషనర్ జె.అరుణ శ్రీ అభినందించారు.
సకాలంలో పన్నులు చెల్లించి నగరపాలకసంస్థకు సహకరించిన పన్ను చెల్లింపుదారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా 2026 -27 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన ఇంటి పన్ను ఏప్రిల్ 30, 2026 లోపు చెల్లించిన వారికి ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద పన్ను మొత్తంలో 5 శాతం రాయితీ ప్రభుత్వం కల్పిస్తున్నదని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువు ముగిసే లోపు 5 శాతం రాయితీ తో ఆస్తి పన్ను చెల్లించి నగరాభివృద్దికి తోడ్పడాలని ఆమె కోరారు