ఆర్టీసీ డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్న : ఎస్సై సాయిరాం
సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించి ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, “Arrive Alive (సురక్షితంగా చేరుకుందాం)” అనే సందేశంతో డ్రైవర్లు తప్పనిసరిగా రహదారి నియమాలను పాటించాలని సూచించారు. ముఖ్యంగా లేన్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, అతివేగం వల్ల జరిగే ప్రమాదాలు, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే తీవ్ర పరిణామాలు, ప్రయాణికుల భద్రతపై డ్రైవర్ల బాధ్యత వంటి అంశాలను వివరంగా తెలియజేశారు. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని, ప్రజల ప్రాణ భద్రత అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బందితోపాటు డ్రైవర్లు పాల్గొన్నారు.
