రంగస్థల నటుడు జేఎస్ మృతి….
పెద్దపల్లి/ ప్రముఖ రంగస్థల, టీవీ నటులు, మాజీ సింగరేణి ఉద్యోగి, జెఎస్ గా చిరపరిచితులైన జల్లారం సత్యనారాయణ(81) గురువారం ఉదయం స్థానిక మార్కండేయ కాలనీలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ, స్థానిక కళాకారులు, పలు కళాసంఘాల బాధ్యులు దామెర శంకర్, మేజిక్ రాజా, కనకం రమణయ్య, చంద్రపాల్, మేకప్ అంజన్న, సిరిపురం శ్రీనివాస్, మేజిక్ హరి, దామెర రాజేష్ తదితరులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నటుడిగా కళా రంగంలో ఆయన చూపిన ప్రతిభ, ఆయనతో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి కళా రంగానికి తీరని లోటన్నారు.

