ఘనంగా ఎస్వీ రంగారావు జయంతి వేడుకలు
తిరుపతి: తన నటనలో నవరసాలు పండించిన గొప్ప నటుడు ఎస్.వి.రంగారావు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఎస్వీ రంగారావు జయంతిని పురస్కరించుకుని స్థానిక రంగస్తలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎస్వీ రంగారావు తన ఆహార్యం, అభినయం, గాంబీర్యం, డైలాగ్ డెలివరీతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. అనేక జానపద, పౌరాణిక, కుటుంబ కథ చిత్రాలలో నటించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కళాకారులుగా ఆయనను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నటులు, దర్శకులు, సంగీత విద్వాంసులు భరద్వాజ్ కి ఎస్వీ రంగారావు స్మారక పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు కేఎన్ రాజా, విద్వాన్ కస్పా పద్మనాభం, వాసుదేవ రెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, రేవతి, ముని మోహన్, విజయసింహారెడ్డి, సిద్ధవరం వెంకటాద్రి, తిరుపాలచారి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
