గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకం.
కలెక్టర్ బి సంతోష్.
జోగులాంబ గద్వాల సాక్షిత :
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి సర్పంచులు ముఖ్య పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు.
ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదవ బెటాలియన్ లో ఐజ, రాజోలి, అలంపూర్, ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు మండలాల సర్పంచులకు ఐదు రోజులపాటు నిర్వహించు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న అన్ని అంశాలను నూతనంగా ఎన్నికైన సర్పంచులు తెలుసుకొని అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు గ్రామస్థాయిలో ఉండే వివిధ ప్రభుత్వ శాఖల వ్యవస్థలపై పూర్తి అవగాహన అవసరమన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, విద్య, ఆరోగ్యం, తదితర ప్రధాన విషయాల్లో బాధ్యత వహించే అధికారులు, సిబ్బంది గురించి తెలుసుకొని తమ తమ గ్రామపంచాయతీలలో ఆయా వ్యవస్థలు సక్రమంగా పనిచేసేందుకు సర్పంచులు బాధ్యత వహించాలన్నారు. ప్రధానంగా పంచాయతీ కార్యదర్శుల విధులు తెలుసుకొని, వారిని సమన్వయం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా సర్పంచులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఐదు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు ప్రతిరోజు పాల్గొని గ్రామ పాలనపై పట్టు సాధించాలని ఆకాంక్షించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 99 మంది సర్పంచులు పాల్గొంటున్న సందర్భంగా సుమారు రెండు లక్షల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి వస్తున్నందున శిక్షణను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రతి శనివారం ఉదయం ప్రత్యేకంగా సర్పంచులు తనను కలిసి తమ గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధి పై మాట్లాడడానికి అవకాశం కల్పించామన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్న సర్పంచులు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, బెటాలియన్ కమాండెంట్ జయరాజు, నరేందర్ రెడ్డి, డిపిఓ శ్రీకాంత్, డిఎల్ పిఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.
