ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి
** మాజీ మంత్రి టీజీ వెంకటేష్ వెల్లడి
తిరుపతి: రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి, ఐక్యతకు, సంఘ సభ్యుల బలోపేతానికి, ప్రభుత్వ పథకాల సక్రమ అమలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా దిండుకుర్తి నరసింహులు, ప్రధాన కార్యదర్శిగా నూతలపాటి హేమంత్ కుమార్, కోశాధికారిగా పబ్బతి మధుసూధనలతోపాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు, పంగులూరు సీతమ్మ ఆర్యవైశ్య సంఘ ధర్మసత్ర డెవలప్మెంట్ అసోసియేషన్ చైర్మన్ టి జి వెంకటేష్, స్థానిక ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు అయ్యేందుకు కృషి చేస్తామన్నారు.
యువత భవిష్యత్తుకు ప్రణాళికతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వివాహ పరిచయ వేదికలు ఏర్పాటుచేసి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల పెద్దల సూచనలతో అందరికీ అందుబాటులో ఉంటూ నిత్యం భక్తి భావాలను పెంపొందిస్తూ విద్య వైద్యం పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. రాజకీయంగా ఎదిగేందుకు ప్రణాళిక పద్ధతిలో చర్యలు తీసుకుంటామన్నారు. మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వంటి మహానుభావులు మన వర్గానికి చెందినవారు కావడం మనకెంతో గర్వకారణం అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవడం మన బాధ్యత అన్నారు. వాసవి పురాణంలో చెప్పబడిన ధర్మాలను భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని అందించి యువతను ప్రోత్సహించాలన్నారు.ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఆర్యవైశ్య సంఘ సభ్యులతో పాటు, కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు తెలిపారు.
